మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ

  • సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో వినిపించిన అసదుద్దీన్
  • బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న అసదుద్దీన్
  • ఇది ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపణ
పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. సభలో వివిధ పార్టీలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయి. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు.

ఈ బిల్లును నిరసిస్తూ ఆయన సాహిర్ లుధియాన్వి రాసిన ఒక కవితను లోక్ సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య మహిళా రిజర్వేషన్‌కు సంబంధించినది కాదని, ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపించారు. ఈ బిల్లు జనాభా ఎక్కువగా ఉన్నరాష్ట్రాలకు మరింత అధికారం ఇస్తుందని అన్నారు.

డీలిమిటేషన్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, బిల్లు ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. దక్షిణాది ప్రాంతాలకు సభలో ప్రాతినిథ్యం లేకుండా ఈ బిల్లు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే సహా వివిధ పార్టీలు వ్యతిరేకించాయి.

Asaduddin Owaisi
Women Reservation Bill
Majlis Party
Parliament
Muslim Representation

More Telugu News